
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నిరంతర కృషి ఫలితంగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల జాతీయ రహదారి (ఎన్హెచ్-63)ని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కీలకమైన ఈ రహదారి విస్తరణతో లక్షెట్టిపేట, మంచిర్యాల, జైపూర్, చెన్నూర్ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి. ముఖ్యంగా సింగరేణి, ఎన్టీపీసీ, పారిశ్రామిక ప్రాంతాలకు సరకు రవాణా మరింత వేగవంతం కానుంది.
గత కొంతకాలంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఈ రహదారి విస్తరణ అవసరాన్ని తీసుకెళ్లారు. మంచిర్యాల ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మంచిర్యాల ప్రాంతం తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలతో మరింత మెరుగైన అనుసంధానాన్ని పొందనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించడం పట్ల ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి కృషి కొనసాగిస్తానని తెలిపారు.
