మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిగ్రాని సమితి సభ్యులతో ఎరువుల నియంత్రణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ సభ్యులకు, రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.రసాయనిక ఎరువులను సిఫారసు వాడాలని, మోతాదుకు మించి వాడకూడదని, నానో యూరియా వాడకాన్ని పెంచాలని, వరి కొయ్యలను కాల్చడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, భూసారం తగ్గిపోతుందని, భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గిపోతుందని, అలానే భూమిలో తగిన తేమ శాతం ఉన్నప్పుడే విత్తానాలు విత్తుకోవాలని, ఎల్నినో ప్రభావం ఉన్నందున వర్షపాతం సాధారణ స్థాయికంటే తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల పంటల పెరుగుదల , దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని,
కావున రైతులు తక్కువ కాలంలో పండే పంట రకాలను ఎంపిక చేసుకోవడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నేలలో తేమ నిల్వ ఉండేలా సేంద్రియ పదార్థాల వినియోగాన్ని పెంచడం, వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేయడం అవసరమని సూచించారు.
అదేవిధంగా వాతావరణ శాఖ విడుదల చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించి వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. రాజశేఖర్, సారంగపల్లి సర్పంచ్ బచ్చలి రాములు,ఉప సర్పంచ్ ఎంబడి సతీష్, పంచాయితి కార్యదర్శి సవ్య, వార్డ్ సభ్యులు, రైతులు కమల మనోహర్ రావు, బండి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

