తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఊరట లభించింది. టీచర్ల ప్రమోషన్లు, ఇతర సర్వీసు అంశాల్లో కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా నిర్వహించే రెండు టెట్ పరీక్షలకు అదనంగా.. మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.పూర్తిగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసమే ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను ప్రభుత్వం తలపెట్టింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక టెట్ నిర్వహణకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో.. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి తదుపరి అవసరమైన అన్ని చర్యలనూ తక్షణమే చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
