క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా మంత్రి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులపై ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలు తీరును స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యాతనపల్లి మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అలానే మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. కేవలం 9వ వార్డులోనే రూ. 4.80 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.అలాగే అమృత్ పథకం కింద రూ. 40 కోట్లతో తాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, తహసీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్,తో పాటు ,స్థానిక కౌన్సిలర్లు ,పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
