ఆత్మరక్షణకు కరాటే, కుంఫు వంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయ…
ఇటీవల నిర్వహించిన నేషనల్ లెవెల్ కరాటే, కుంఫు పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులకు మందమర్రి లోని సింగరేణి పాఠశాల మైదానంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జెట్టి కృష్ణ సారధ్యంలో జరిగిన ఈ సన్మాన మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద.తిరుమల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మంద తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి మన ప్రాంత కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన విద్యార్థులను అభినందించారు. చదువుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసానికి, ముఖ్యంగా ఆత్మరక్షణకు కరాటే, కుంఫు వంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన మాస్టర్ జెట్టి కృష్ణ కృషిని ఆయన కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ముఖ్యఅతిథి చేతుల మీదుగా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు, కరాటే అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
