భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు..
తొలి ఏకాదశి సందర్భంగా మందమర్రి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ వెంకటేశ్వర దేవాలయం, పంచముఖి హనుమాన్ ఆలయం, శ్రీ కోదండ రామాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, సాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవతామూర్తులకు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పంచామృతాభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించి, తీర్థప్రసాదాలు స్వీకరించి దైవానుగ్రహం పొందారు.
తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆలయాలను విద్యుత్ దీపాలతో, పూలతో అందంగా అలంకరించగా, భక్తి వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీలు, అర్చకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
