త్యాగానికి నివాళి.. ఐక్యతకు ప్రతీక.. పీర్ల పండుగ…
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతమైన మందమర్రిలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు. “హిందూ-ముస్లిం భాయ్ భాయ్” అనే నినాదాన్ని నిజం చేస్తూ, కులమతాలకు అతీతంగా పట్టణ ప్రజలంతా ఈ ఆధ్యాత్మిక సంబరంలో ఏకమయ్యారు.
తెలంగాణ సంస్కృతిలో మొహర్రం కేవలం ముస్లిం సోదరుల పండుగ మాత్రమే కాదు, అది సామాన్యుల పీర్ల పండుగ. పట్టణంలోని వివిధ ఏరియాలు,బజార్లు, సింగరేణి క్వార్టర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పీర్ల చావుడుల (ఆషూర్ఖానా) వద్ద ప్రజలు సంయుక్తంగా పాల్గొని పీర్లకు దట్టీలు కట్టి ,పూలదండలు, కుడుకలు , బెల్లం సమర్పించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.రాత్రి వేళల్లో పీర్ల చావడి వద్ద నిప్పుల గుండం (అలావా) రాజేసి,యువకులు “అసోయి దూలా… హారతి” అంటూ లయబద్ధంగా పాడే గీతాలు, నృత్యాలు ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ
పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, స్థానిక ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు పీర్ల చావుడులను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు మందమర్రి ప్రాంతానికే నిలువెత్తు ‘గంగా-జమున జహజీబ్’ (సమైక్య సంస్కృతి) నిలయమని మరోసారి నిరూపించాయి.
