కే.జి.బి.వి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్…
వేమనపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్దేశిత గడువులోగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని వేగవంతంగాపూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహం, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న మెనూ,తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర వసతులపై ఆరా తీశారు. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందించాలని,పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సాయికృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి, సంబంధిత అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
