న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి…
సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అధికారులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. అధికారులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా అధికారుల సంఘ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కోల్ ఇండియా తో సమానంగా సింగరేణిలో అధికారులకు కూడా పే అప్ గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలానే గత రెండేళ్లుగా నిలిచిపోయిన పిఆర్పి నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్లు కష్టపడుతున్న అధికారులపై పని ఒత్తిడిని తగ్గించి వారికి తగిన రక్షణ కల్పించాలని అన్నారు. అలాగే నల్ల బ్యాచులతో నిరసన తెలిపిన యాజమాన్యంలో చలనం లేకపోవడం వల్లే ఈ దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకుంటే రాబోయే రోజుల్లో సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ దీక్షా కార్యక్రమాలలో డీజీఎం అబ్దుల్ ఖదీర్, దేవులపల్లి. శ్రీనివాస్, అధికారుల సంఘ ఉపాధ్యక్షులు వర్ధన్, జాయింట్ సెక్రెటరీ సంతోష్, రవి తోపాటు స్థానిక సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు.
