SITI NEWS TELANGANA
తెలంగాణ

సామాన్యుడి బతుకు భారం.. వంటింట్లో మంట, జేబుకు చిల్లు

ధరాఘాతం: సామాన్యుడి బతుకు భారం.. వంటింట్లో మంట, జేబుకు చిల్లు!

సిటి న్యూస్ తెలంగాణ ప్రత్యెక వార్తా కథనం :

మధ్యతరగతి, సామాన్య కుటుంబాల బడ్జెట్‌ పూర్తిగా తలకిందులైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువుకూ అదనంగా జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇంధన ధరల భారం,మరోవైపు వాతావరణ మార్పులతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడు ‘బ్రతికేదెలా?’ అని లబోదిబోమంటున్నాడు.

1. చమురు సెగ.. రవాణా భారం!

ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు భారీగా పెరగడంతో దాని ప్రభావం పరోక్షంగా ప్రతి రంగంపై పడింది.
♦ రవాణా ఖర్చులు : డీజిల్ ధరల పెరుగుదల వల్ల లారీలు, ఆటోలు, క్యాబ్‌ల ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల రవాణా వ్యయం పెరగడం వల్ల వ్యాపారులు కూడా ధరలు పెంచుతున్నారు .
వాహనదారుల ఇబ్బందులునిత్యం ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు నెలవారీ పెట్రోల్ బడ్జెట్ చూసి హతాశులవుతున్నారు.

 2. వంటగ్యాస్ ‘మంట’.. గృహిణుల ఆవేదన!

వంటింట్లో గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయి. సబ్సిడీలు నామమాత్రంగా మారడం, సిలిండర్ ధరలు వేయి రూపాయల మార్కును దాటి కొనసాగుతుండటంతో గృహిణులు బడ్జెట్ సర్దుబాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.”ఆదాయం పెరగడం లేదు కానీ, గ్యాస్ బిల్లులు మాత్రం భారంగా మారుతున్నాయి” అని మధ్యతరగతి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 3. సెంచరీ దాటుతున్న కూరగాయల ధరలు!

ఇక సామాన్యుడి ప్రధాన ఆహారమైన కూరగాయల ధరలకైతే రెక్కలొచ్చాయి. అకాల వర్షాలు, కొన్నిచోట్ల వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది.
♦ మార్కెట్లో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సహా చాలా రకాల కూరగాయలు కిలో రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి.
♦ గతంలో మార్కెట్‌కు వెళ్తే రూ.200లతో సంచి నిండా కూరగాయలు వచ్చేవి, ఇప్పుడు రూ.500 నోటు తీసుకెళ్లినా అరకిలో, పావుకిలోలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సామాన్యుడి గొంతుక : “నెల జీతం మారదు.. కానీ నిత్యావసరాలు, పెట్రోల్, కూరగాయల ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.
పిల్లల చదువులు, ఇంటి అద్దెలు చూసుకోవాలా? లేక తిండికి ఖర్చు పెట్టాలా? అర్థం కావడం లేదు.” ఒక మధ్యతరగతి ఉద్యోగి ఆవేదన.

ధరల వ్యత్యాసం – ఒక పరిశీలన (అంచనా)

| వస్తువు / సేవ | గతంలో సగటు ధర | ప్రస్తుత సగటు ధర |
| *టమాటా (కిలో)* | రూ. 20 – 30 | రూ. 50 – 60+ |
| *ఉల్లిపాయలు (కిలో)* | రూ. 20 – 25 | రూ. 50+ |
| *వంట నునే (కిలో)* | రూ. 120 – 185 | రూ. 240 + |
| *రవాణా ఖర్చు (బస్తాకు)* | సాధారణం | 40% – 50% పెరిగింది |

♦ ఆదాయం ఒకేచోట నిలిచిపోగా.. ఖర్చులు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పొదుపు అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది.ఈ ధరాఘాతం నుంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, సబ్సిడీలు పెంచి, నిత్యావసరాలు,ఇంధన ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే సామాన్యుడి బతుకు మరింత దుర్భరంగా మారడం ఖాయం అని వారు ఆవేదన వేక్తం చేస్తున్నారు.

Related posts

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్రమార్క

siti news telangana

గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పనులను శంకుస్థాపనకు రానున్న మంత్రులు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

siti news telangana

మొక్కలను సంరక్షిస్తూ అడవులను కాపాడుకుందాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana