నకిలీ విత్తనాల విక్రయదారులపై మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా మెరుపు దాడి నిర్వహించి ముఠా గుట్టురట్టు చేశారు. అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరు నేరస్థులను పట్టుకుని, వారి నుండి సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మరియు రవాణాకు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ, వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించారు. విత్తనాలు కొనేటప్పుడు కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసి తప్పనిసరిగా రశీదులు (బిల్లులు) తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అలానే నేరస్తులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై జి. నరేష్ , కానిస్టేబుల్ రాకేష్, చైతన్య లను మందమర్రి సిఐ ప్రత్యేకంగా అభినందించారు.

