‘ఎస్.ఐ.ఆర్ ‘ సర్వేలో పాల్గొన్న ఎంపీ..
ప్రతి అర్హుడికీ ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనేదే సంకల్పం..
బెల్లంపల్లి / తాండూర్ :
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి అర్హులైన పౌరుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రెవిసిఒన్ రివిజాన్ ) ప్రత్యేక సమగ్ర పునశ్చరణ ఓటర్ల సర్వే కార్యక్రమంలో భాగంగా, తాండూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గడప గడపకూ తిరుగుతూ అధికారుల సర్వే తీరును, ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఓటు హక్కు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్ల నివారణకు ఈ ఎస్.ఐ.ఆర్ సర్వే ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఎక్కడా కూడా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.యువత, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అలానే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో నివారణ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచిస్తూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్వే అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
