కాంట్రాక్టర్ల కబంధ హస్తాల నడుమ మందమర్రి అభివృద్ధి పనులు..
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఇబ్బందులు…
నిధులున్నా మారని పట్టణ రూపురేఖలు…
సింగరేణి నల్ల బొగ్గు గనుల హబ్గా, వేలాది కార్మిక కుటుంబాలకు నిలయంగా ఉన్న మందమర్రి పట్టణ అభివృద్ధి ప్రస్తుతం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి,అధికారుల ఉదాసీనతకు బలవుతోంది. రోడ్ల నిర్మాణం, అంతర్గత మురుగు కాలువలు, మౌలిక వసతుల కల్పన కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పనుల కేటాయింపులో సిండికేట్గా మారిన కొందరు
కాంట్రాక్టర్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని మందమర్రి మున్సిపాలిటీ విలవిలలాడుతోంది. మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించిన అప్పటికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనుల లో నిర్లక్షం కొత్తన్చేనట్టు కనబడుతుంది అని ఆరోపణలు ఉన్నాయి .
‘నాణ్యత’ అటకెక్కింది.. పర్యవేక్షణ కరువైంది :
♦ కాంట్రాక్టర్లు లాభాల కక్కుర్తితో నిబంధనలకు విరుద్ధంగా అత్యంత నాసిరకం మెటీరియల్ను వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలనీల నిర్మాణంలో సరైన నిష్పత్తిలో సిమెంట్,ఇసుక వాడకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే అవి పగుళ్లు తేలుతున్నాయి. కొందరు మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలపడం వల్లే క్వాలిటీ చెకింగ్ నామమాత్రంగా సాగుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి ఏరియాలో తీవ్ర నిర్లక్ష్యం :
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి కార్మిక వాడల్లో శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. స్థానిక ప్రజాప్రతినిధులు పనులను వేగవంతం చేయాలని హెచ్చరిస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్ల ధీమా వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ప్రజాప్రతినిధుల హెచ్చరికలు సైతం బేఖాతర్ :
మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన సందర్భాల్లో స్వయంగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు “పనుల్లో జాప్యం చేయవద్దు,నాణ్యతతో చేయాలి” అని కాంట్రాక్టర్లను గట్టిగా ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం గమనార్హం.
ప్రజల డిమాండ్లు :
1. విచారణ జరపాలి : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో గడిచిన కాలంలో జరిగిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనుల నాణ్యతపై ఉన్నతాధికారులతో విజిలెన్స్ విచారణ జరిపించాలి.
2. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి : గడువు ముగిసినా పనులు పూర్తి చేయకుండా, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేసి, వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి.
3. థర్డ్ పార్టీ ఆడిట్ : పట్టణంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి “థర్డ్ పార్టీ” క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు తప్పనిసరి చేయాలి.
ఒకప్పుడు కార్మిక ఉద్యమాలకు కేంద్రమైన మందమర్రి పట్టణం, కాంట్రాక్టర్ల స్వార్థానికి బలవ్వకుండా అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేశాలకు అభిప్రాయాని వేక్తం చేస్తున్నారు .

