మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు మందమర్రి స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నేటి యువత, విద్యార్థులు క్షణికానందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్ల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా చట్టపరమైన కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, అంకితభావ అలవర్చుకుని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి విద్యార్థి ఒక “యాంటీ డ్రగ్ సోల్జర్” లాగా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం విద్యార్థులందరితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ అవగాహన సదస్సులో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ), స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
